360 ఏళ్ల కింద తెలంగాణ గడ్డపై మొఘల్ నిరంకుష పాలనను ఎదిరించి తాడిత, పీడిత ప్రజలను ఏకం చేసి బహుజన రాజ్యం నిర్మించిన పాపన్న ఈ ప్రాంత బిడ్డల పౌరుషాన్ని ప్రపంచానికి చాటాడు. తెలంగాణ ప్రాంత అస్థిత్వంలో తిరుగుబాటు ఉందని నిరూపించిన ఉద్యమకారుడు పాపన్న. గీత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నేడు పాపన్న జయంతి సందర్భంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
వరంగల్ జిల్లా జనగామ మండలం ఖిలాషాపూర్లో సర్వాయి పాపన్న 1650 ఆగస్టు 18న సామాన్య గౌడ కుటుంబంలో జన్మించాడు. చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు ఉన్న పాపన్నకు స్నేహితులు ఎక్కువగా ఉండేవారు. పాపన్న యుక్త వయస్సుకు రాగానే చుట్టూ ఉన్న పరిస్థితులను నిశితంగా గమనించేవాడు. అప్పటి పాలకులు ప్రజలపై ఇష్టారీతిలో పన్నుల భారం మోపేవారు. పన్ను చెల్లించనివారికి కఠిన శిక్షలు విధించేవారు. ప్రశ్నిస్తే బంధించేవారు. నిర్ధాక్షిణ్యంగా చంపేసేవారు. ఇవన్నీ గమనించిన పాపన్న నవాబులు, జాగీరుదార్లు, జమీందార్లపై తిరుగుబాటుకు వ్యూహాలు రచించిచాడు.
యుక్త వయస్సులోకి వచ్చిన పాపన్నను అతని తల్లి సర్వమ్మ కుల వృత్తి చేపట్టి తాళ్లెక్కమని అడుగగా, కొడితే గోల్కొండను కొట్టాలి. కానీ, తాళ్లెక్కుతే ఏ మ స్తుంది అని యాదృచ్ఛికంగా అన్న మాటలే ఆయన జీవన గమనాన్ని మార్చివేశాయి. పాలకుల అరాచకాలను చూస్తూ ఊరుకోని పాపన్న తన మిత్రులను సమీకరించుకుని రహస్యంగా వారికి శిక్షణను ఇచ్చేవాడు. తన తల్లి దాచుకున్న ధనంతో ఆయుధాలు సమకూర్చుకున్నాడు. గడీలు, కోటలపై మెరుపు దాడులు చేసి దొరలు, జమీందార్లు, జాగీర్దారులు ప్రజల నుంచి బలవంతంగా వసూలు చేసిన సొమ్మును స్వాధీనం చేసుకున్నాడు. అక్కడ బంధీలుగా ఉన్న వారికి విముక్తి కల్పించాడు.
No comments:
Post a Comment