శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమను "శ్రావణ పూర్ణిమ లేక జంధ్యాల పూర్ణిమ" అంటారు. దీన్నే రాఖీ లేఖ రక్షాబంధన్ పండుగగా కూడా పిలుస్తూ ఉంటారు. అన్నాచెలెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు.
హిందు సాంప్రదాయం ప్రకారం, శ్రావణమాసంలో రాఖీ-పౌర్ణమి జరుపుకుంటారు.
ఉత్తర భారదేశంలో రాఖీ-పౌర్ణమిని రక్షాబంధన్ గా పేర్కొంటారు.
సోదరి తన సోదరుడికి పూర్తి సంవత్సరం విజయం చేకూరాలని రాఖీ కడుతుంది.
రాఖీ కట్టిన సోదరికి జీవితాంతం రక్షగా ఉంటానని సోదరుడు భావించే పండుగ.
నిజానికి, భారతదేశంలో రాఖీపౌర్ణమి లేదా రక్షాబంధన్ ఎపుడు ప్రారంభమైందో, ఎలా ప్రారంభమైందో తెలిపే నిర్దిష్ట సాక్ష్యదారాలు లేవు. కానీ, పురాణాలలో తెలిపిన విధంగా, వివిధ రకాల కథలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ తెలుపబడ్డాయి.
ద్రౌపది -శ్రీకృష్ణుని బంధం
ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది, శ్రీకృష్ణుడికి అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు.
అలెగ్జాండర్ భార్య - పురుషోత్తముడి కథ
చరిత్ర పుటల్లో అలెగ్జాండర్ భార్య 'రోక్సానా' తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. ఆ క్రమంలో బాక్ట్రియా (నేటి అప్ఘనిస్తాన్)కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహసంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చి నాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్ ఆలోచన. అలెగ్జాండర్ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి, అలెగ్జాండర్ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన సోదరుడిని చంపవద్దని తన భర్త అయిన అలెగ్జాండర్ను కోరుతుంది. దీంతో అలెగ్జాండర్ యుద్ధం విరమించుకుంటాడు.
కారణాలు, కారకాలు మరియు చరిత్రలు ఏవైనప్పటికీ, ఉన్మాదత్వం, విచక్షనా వంటి వెకిలి చేష్టలు పేట్రేగి, మనవతా విలువులు మంటగలుస్తున్న ప్రస్తుత ఆధునిక యుగంలో "రాఖీ పౌర్ణమి" తన విశిష్టతను చాటిచెబుతూ సోదర ప్రేమ పటిష్టతకు దోహదపడుతుంది.
No comments:
Post a Comment